9వ అధ్యాయము
యమదూత సంభాషణము, విష్ణుదూతోక్తి అజామిళునివిముక్తి

విష్ణుదూతలడిగిరి. ఓ యమదూతలారా ! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? పాతకమనగా ఏమి ? ఈ విషయములన్నిటిని మాకు జెప్పుడు. ఇట్లని విష్ణుదూతలడుగగా యమదూతలు లిట్లు పల్కిరి.
ఓ విష్ణుదూతలారా ! సావధానముగా వినుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను జేసిన వానిని దండింతుము.
వేదమార్గమును వదలి ఇచ్చానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధుబహిస్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండింతుము.
నిత్యము అబద్దమాడుచు జంతువులను జంపుచు కులాచారమును వదలిన వారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని, పాపకర్మలందాసక్తులైన వారిని మేము దండింతుము.
పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును జెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్ర ద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును జేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిఇన, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును,నూతిని, చిన్నకాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము. మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానినిమేము దండింతుము.
పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించు వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగియనగా తాను వండిన అన్నములో ఇతరులకు యెంత మాత్రమును బెట్టకతానే అంతయు భుజించు వాడు. పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు.
ఇతరుడు దానము చేయుసమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వనివానిని, తన్ను శరణుజొచ్చినవానిని చంపు వానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచు వానిని, నిత్యము బ్రాహ్మణనిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈమొదలయిన పాతక ములను జేయుమానవులు యమలోకమందుండు మాచేత యాతనలను పొందుదురు.
ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసంగ లోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడడగును. ఈ ప్రకారముగా పలికిన యమదూతలమాటలు విని విష్ణుదూతలు చిఱునగవుతో వికసించిన ముఖపద్మ ములు గలవారై మేఘసమాన గంభీరధ్వనితో నిట్లనిరి. ఏమియాశ్చర్యము. మీరింత మూడులు, ధర్మమర్యాదను మేము చెప్పెదము, సావధానముగా వినుదు.
దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనమును జేయువాడు యమదండారుడుగాడు. స్నానసంధ్యావందనము లాచరించువాడును,
జపహోమాదులాచరించువాడును, సర్వభూతములందు దయావంతు డును, యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మలఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదందారుడు గాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణపరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణబుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పర్యముగా కలవాడు.యమమందిరానికి వెళ్ళడు. అన్నదాన మాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సరము =ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరినవారికి విద్యాదాన మాచరించువాడును, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందదు.
హరిని బూజించువాడును, హరినామము జపించువాడును, వివాహ ములను ఉపనయనములను జేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములను గట్టించువాడును, దిక్కులేని శవము నకు మంత్ర సంస్కారమును జేయించువాడును యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామార్చనమాచరించి ఆ తీర్థమునుపానము జేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు.
తులసీకాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామ మును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవత మును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతుల యందుండగా ప్రాతస్నానమాచరించువారు యమలోక మును పొందరు.
రుద్రాక్షమాలికను ధరించి జపదానహోమాదులను ఆచరించువాడు యమలోక మును పొందడు. నిత్యమును అచ్యుట, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓరామయని హరినామసంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశియందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందిన యెడలవాడు సర్వపాపములు చేసిన వాడయినను యమలోకమును పొందడు.
దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురు భార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు.
మహిమను తెలిసికొనిగాని, తెలియకగాని మరణకాలమున హరి నామ సంకీర్తన గావించినవారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు
బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచేత పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరిహరీయని అన్న యెడల యమయాతన పొందడు. అనేక జన్నలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెఱిగియున్న పాపములన్నియు భూమియందుగాని స్వర్గమందుగాని హరినామసంకీర్తనముచేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరి నామస్మరణమును జేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును.
విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిళుని యమదూతల వలన విడిపిం చిరి. తరువాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారముచేసి మీదర్శనము వలన నేను తరించితిననెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకుబోయిరి.
తరువాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేక పోతిని గదా. ఛీ ! నా బ్రతుకు సజ్జననిందితమాయెనుగదా, పతివ్రతయైన భార్యను వదలివేసి కలుద్రాగెడి ఈ దాసీ భార్యను స్వీకరించి తినిగదా, వృద్ధులు నాకంటే వేరేదిక్కులేని వారును పుణ్యాత్ములయిన
మాతా పితరులను నీచుడనై విడిచితినిగదా, అయ్యో యెంతకష్టము, ధర్మమును చెఱుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను.
ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా ఆ నల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను ఇదినిజము. అట్లు గానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లు గలుగును? నా జిహ్వహరినామ మును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులను జంపునేనెక్కడ, మంగళకరమయిన నారాయణ నామమెక్కడ?
అజామిళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని బొందెను. కాబట్టి నారాయణ నామ కీర్తన గావించువారు సమస్త పాపవిముక్తులై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియములేదు.